“ధమ్మ దీపావళి” పేరుతో ఇటీవల వెలువడిన వీడియోలో, బొర్రా గోవర్ధన్, దీపావళి పండుగ చారిత్రిక నేపధ్యాన్ని వివరించటానికి ప్రయత్నించారు. (వీడియో లింక్: https://www.youtube.com/watch?v=jFZDtmDIMDc&t=870s)
దీనిలో, “చరిత్రకు అందిన ఆధారాలను బట్టి …” అంటూ మొదలెట్టిన వక్త, దీపావళి పండుగ ఎలా పుట్టిందనే విషయానికి సంబంధించి ఒక సరికొత్త కథనాన్ని వినిపించారు. అయితే, ఆయన తన వాదనకు సరైన చారిత్రిక ఆధారాలు చూపించలేదు. ఇందుకు మారుగా, బౌద్ధగ్రంథాలు చెబుతున్న వాస్తవ చరిత్రకు భిన్నమైన, ఇంకా విరుద్ధమైన అనేక కల్పనల్ని ఈ కథనంలో గుప్పించారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూడండి.
1. వర్షావాస సంప్రదాయాన్ని బుద్దుడు నిర్మించాడు (ప్రారంభించాడు).
2. మూడు నెలల వర్షావాసంలో, భిక్షువులు గృహస్తుల దగ్గరకు భిక్షకు వెళ్ళకూడదు. వారు విహారాలను వదలి అడవుల్లో గుహల్లో (ఒంటరిగా) నివసిస్తూ, అడవుల్లో దొరికే పండ్లు, ఆకులు, దుంపలు, పూలు మాత్రమే తినాలి.
3. భిక్షువులు ఈ మూడునెలల కాలంలో (వర్షావాసంలో) ధర్మసందేశం ఇవ్వరు.
4. భిక్షువులు ఆశ్వయుజ మాసంలో (వనవాసం చాలించి) తిరిగి ఆరామాలకు చేరుకుంటారు. అప్పుడు గృహస్తులు వారికి దీపాలతో స్వాగతం పలుకుతారు. ఇదే దీపావళి పండుగ చారిత్రక నేపధ్యం.
పైన పేర్కొన్న విషయాలను నిరూపించటానికి, “ధమ్మ దీపావళి” కథనంలో, మూల బౌద్ధగ్రంథాల నుండి గాని లేదా బౌద్ధ చరిత్రను వివరించే ఆధునిక గ్రంథాల నుండి గాని ఎటువంటి రుజువులు చూపించలేదు. మరి, కథకుడు చెప్పిన ‘చరిత్ర’ వాస్తవమో, కాదో నిర్ధారించటం ఎలా? …. కథనం ఆకర్షణీయంగా ఉందని, దానిలో చెప్పిన విషయాలను నిజమైన చరిత్రగా భావించటం సరైన పధ్ధతి కాదు. ఈ విషయంలో, నిజానిజాలను నిగ్గుతేల్చాలంటే మనం మూల బౌద్ధగ్రంథాలను పరిశీలించక తప్పదు.
భిక్షుసంఘ వర్షావాస నియమాలు (ఇవి భిక్షువులకు, భిక్షుణిలకు కూడ వర్తించే నియమాలు) ఏమిటో తెలుసుకోటానికి సరైన వనరు వినయ పిటకంలోని మహావగ్గ (వర్షోపనాయికా స్కంధకము). దీనిలో చెప్పిన విషయాల వెలుగులో పైన పేర్కొన్న నాలుగు అంశాలను పరిశీలిద్దాం.
భారతావనిలో వర్షావాస సంప్రదాయం బుద్ధుని కాలానికి ముందునుండి అమలులో ఉన్నట్లు మహావగ్గ (3.1.1) చెప్పింది. ఈ ఆచారాన్ని బౌద్ధసంఘం ఇతర ధార్మిక శాఖల (జైన, ఆజీవక తదితర శాఖల) నుండి స్వీకరించినట్లు స్పష్టంగా చెప్పబడింది. కనుక, ఈ సంప్రదాయాన్ని బుద్ధుడు ప్రారంభిచాడని చెప్పటం సరికాదు.
వర్షావాసంలో అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఏమిటంటే, వర్షాకాలంలో భిక్షువులు సంచారం చెయ్యకుండా ఒకే గ్రామంలోని లేదా పట్టణంలోని విహారలో సామూహిక జీవనం సాగించాలి (మహావగ్గ 3.1.4). అత్యవసరమైన కొన్ని పనుల నిమిత్తం, వర్షావాసంలో ఒక వారంపాటు మాత్రమే బయటకు వెళ్లిరావటానికి, భిక్షుసంఘ సభ్యులకు అనుమతివుంది (మహావగ్గ 3.2). కనుక, వర్షావాసంలో భిక్షువులు ‘అడవుల్లో గుహల్లో (ఒంటరిగా) నివసిస్తూ, అడవుల్లో దొరికే పండ్లు, ఆకులు, దుంపలు, పూలు మాత్రమే తినాల’నే నియమం ఉందని చెప్పటం తప్పు.
ఇక, వర్షావాసంలో భిక్షువులు విహారాల్లో కలిసి జీవించారని, ధర్మం గురించి చర్చించారని చెప్పటానికి సుత్తపిటకంలో అనేక రుజువులు కనిపిస్తాయి. అంతేకాదు, వర్షాకాలంలో గృహస్తులు విహారాలకు వెళ్లి, భిక్షువులకు ఆహారం ఔషధాలు దానం చేశారని, భిక్షువులు గృహస్తులకు ధర్మోపదేశం చేశారని చెప్పటానికి, వినయ పిటకంలో తగిన సాక్ష్యాలు ఉన్నయ్. భిక్షువులే కాదు, స్వయంగా బుద్ధుడు రాజగృహ, కోసంబీ, వైశాలి, శ్రావస్తి వంటి పట్టణాల్లో వర్షావాసం గడుపుతూ, భిక్షువులతో, గృహస్తులతో సంభాషించిన సందర్భాలు సుత్తపిటకంలో నమోదయ్యాయి. (ఉదాహరణకు, మధ్యమనికాయ 77.6; అంగుత్తరనికాయ 5:55 & 11:13 చూడండి). కాబట్టి, “భిక్షువులు వర్షావాసంలో ధర్మసందేశం ఇవ్వర”నే ప్రకటన అసంబద్ధం.
మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే, “వర్షాకాలంలో అడవుల్లో నివసించాలి” అనేది ఆచరణ సాధ్యంకాని నియమం. బుద్ధుడు, ఆచరణ యోగ్యం కాని, ఇటువంటి నియమాన్ని బోధించివుండడని చెప్పటానికి కొద్దిపాటి లోకజ్ఞానం చాలు. ప్రత్యేకించి భిక్షుణిలు అసలు అడవుల్లో నివశించరాదనే నియమం భిక్షుణీ స్కంధకంలో (6.1) ఉంది. కనుక, వర్షావాసంలో భిక్షుణిలు అడవుల్లో నివశించే అవకాశమే లేదు.
పైన చెప్పిన విషయాల వెలుగులో పరిశీలిస్తే, “భిక్షువులు ఆశ్వయుజ మాసంలో (వనవాసం చాలించి) తిరిగి ఆరామాలకు చేరుకుంటార”నేది కేవలం కల్పిత ప్రకటన అనుకోకతప్పదు. అంతేకాదు, చీకటిపడిన తరువాత భిక్షుసంఘ సభ్యులు, గ్రామంలో లేదా విహారలో గాని, గృహస్తులను కలవటం నిషేధం. కనుక, “గృహస్తులు భిక్షువులను దీపాలతో ఆహ్వానించార”ని చెప్పటం వట్టి కల్పన మాత్రమే.
ఇలాంటి కల్పితకథల ఆధారంగా దీపావళి ‘చారిత్రిక నేపధ్యాన్ని’ వివరించే కథనాలను వివేకవంతులైన ప్రజలు హర్షించరు. ఇటువంటి కట్టుకథలు బౌద్ధవ్యాప్తికి దోహదం చెయ్యవు సరికదా, చివరకు “బౌద్ధులు అసత్యవాదులు, ఇతర మతస్తుల వలె వారు కూడ పుక్కిటి పురాణాలు చెబుతారు” అని ప్రజలు నిందించటానికి ఊతమిస్తాయి. అదెలావున్నా, ఒక కల్పిత పురాణం (నరకాసురవధ) తప్పని నిరూపించటానికి, మరో కల్పిత కథనాన్ని సృష్టించటం సరైన పద్ధతి కాదు. “అసత్యాన్ని సత్యంతో జయించమ”ని బుద్ధుడు చెప్పిన మాట సర్వదా అనుసరణీయం. కనుక, బౌద్ధ అనుయాయులు, వాస్తవ చారిత్రిక దృష్టి కలిగిన ప్రజలు, ఇటువంటి కల్పిత కథనాలను తిరస్కరించాలి.
బుద్ధుని తదనంతర కాలంలో, బౌద్ధులు దీపాల పండుగ జరుపుకున్న సందర్భం, సంప్రదాయం నెలకొని ఉన్నట్లయితే, ధార్మిక స్ఫూర్తిని నింపే తమదైన పద్ధతిలో, బౌద్ధులు ఆ పండుగ జరుపుకోవటం సమంజసమే; ఆ సంప్రదాయ వాస్తవ నేపధ్యాన్ని ప్రజలకు తెలియజెప్పటం అభినందనీయమే. కాని, ఇందుకోసం లేనిపోని కట్టుకథలను, పుక్కిటి పురాణాలను సృష్టించి, వాటిని ప్రచారం చెయ్యటం మొదటికే మోసం తెస్తుందని మనం గుర్తించాలి.
రచన: డి. చంద్రశేఖర్
సతి లో ఉండి రాశారు
తెలిసో తెలియకో కొందరు చేస్తున్న పొరపాట్లను సరిదిద్దవలసిన అవసరం ఉంది. ఆ దిశగా మీ ప్రయత్నం అభినందనీయం
కామెంట్ రాసేవారు, కామెంట్ బాక్సు కింద తమ పేరు రాయటానికి చోటుంది. గమనించగలరు.
బుర్ర గోవర్ధన్ గారి ప్రసంగం విన్న తర్వాత, తనకు కూడా బౌద్ధం పట్ల కొంత ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దు కుంటే మనకు ఉపయోగపడతారు ఏమోనని చిన్న ఆలోచన.
ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు రకరకాల కారణాలతో దీపావళి జరుపుకుంటారు. ఎవరి నమ్మకాలు వారివి.
గ్రీకు సుందరి హెలెన్ ను ట్రాయ్ అనే రాకుమారుడు ప్యారిస్కు లేవ దీసుకొనిపోయి ట్రోజన్ యుద్ధానికి కారకుడయ్యాడు. ఆర్యులు రాసిన రామాయణం కూడా పైన రాసిన సంఘటనకు పూర్తి కాపినే.. మనం ఎంత చెప్పినా ఎవరు వినరు. ఎవరు విన్నా విభేదించిన మనం చెప్పదలుచుకున్నది చెప్పుకుంటూ పోవడమే.
చారిత్రిక ధర్మం అయిన బౌధదర్మం గురించి కల్పల్ని అవాస్తవాలని వ్రాసే వారితో పాటు బౌధదర్మ ప్రచారకులు సత్యాన్ని మరచి అవాస్తవాలని, కాల్పల్ని వ్రాయడం శోచనీయం. వీరు బౌధదర్మన్ని ప్రచారము చేయు ఉత్సుకత తో విరుద్ధమైన కల్పలను,పుక్కిటి పురాణాలు జోడించడం మరియు అసత్య ప్రచారానికి దోహద పడటం గర్హనీయం. ఇకపై దుస్సాహసం చేసి బౌధధర్మ గాఢతను పలుచన చేయకుండా నిరోదిస్తు ” దీపావళి కల్పిత చరిత -1″అనే వ్యాసము వ్రాసిన డి. చంద్రశేఖర్ గారు అభినందనీయులు వారికి దర్మభివందనాలు.
దేనిని నమ్మాలి..దేనిని నమ్మ కూడదు. దేనిని అనుసరించాలి.. దేనిని అనుసరించ కూడదు. అన్న మీమాంస వచ్చిన్నప్పుడు కాలామా సుత్తం ఆధారంగా అనుభవం ద్వారా, వివేచన ద్వారా,హేతువు ద్వారా అవగాహనకు తెచ్చుకోవాలి.వాదం.. ప్రతి వాదం అనే దృష్టితో చూస్తే ,చెప్పే దానికి దమ్ము లక్షణం పోతుంది.
“దమ్మ “అని రావలసింది.. “దమ్ము “అని వచ్చింది. సవరించి స్వీకరించండి.
ఎవరైనా సరే చారిత్రిక విషయాలను చర్చించేటప్పుడు తగిన ఆధారాలను చూపించాలని బాగా చెప్పారు
చరిత్రని వక్రీకరించడం ద్వారా ఏంచెప్పాలనుకుంటున్నారో తెలియదు మీరన్నట్లు ఇది బౌద్ధానికి మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుంది. దీన్ని కందించడం ఎంతో అవసరం. మంచిపని చేసారు. తప్పకుండ అబినందించవలసిన విషయం.
పురుషోత్తం. కలవకూరు నున్న.
బౌద్ధం లో దీపాలు దీపావళి ఎమిటి?నేడు వైదిక బ్రాహ్మణులు చెబుతున్న కట్టుకథల దీపావళికి అసలు చరిత్ర ఏమిటి??
మీరు గోవర్ధన్ గారికి స్వయంగా తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. మీరన్నట్టు అసత్యాన్ని సత్యంతో జాయిచాలి. ఇప్పుడిప్పుడే వర్ధమానమవుతున్న బౌద్ధం అసత్య కథానికల వల్ల తిరోగమనం పాలవుతుంది. విమర్శల కన్నా ధర్మాన్ని తెలియజెప్ప గలగలి. బుద్ధుడు ఇతరులను విమర్శించడం కాకుండా సహజ ధర్మాన్ని అంటే ధర్మచక్ర ప్రవర్తనకు ప్రాముఖ్యం ఇచ్చాడు. మనమందరం ధర్మాన్ని ఉన్నదున్నట్లు చెప్పే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. విమర్శనా సామర్ధ్యాన్ని కాదు.
బుద్ధవచనం ఇలా చెబుతుంది: “విమర్శించదగిన వారిని వాస్తవికంగా, తగినరీతిలో, సరైన సమయంలో విమర్శించేవారు, ప్రశంసించదగిన వారిని వాస్తవికంగా, తగినరీతిలో, సరైన సమయంలో ప్రశంసించేవారు సరైన, ఉన్నతమైన, శ్రేష్టమైన వ్యక్తులు” [అంగుత్తర నికాయ 4:100]. దీనిప్రకారం, మనం ధర్మాన్ని పరిశుద్ధంగా చెప్పే సామర్ధ్యంతో పాటు, సరైన విమర్శనా సామార్ధ్యాన్ని కూడ పెంచుకోవటం అవసరం.
చాలా బాగుంది మీ విశ్లేషణ.
చంద్రశేఖర్ గారికి బుద్ధ వందనాలు!!దీపావళి సంబంధించి పది..పదిహేను కధనాలు..దేశవ్యాపితంగా ప్రచారం లో ఉన్నాయి.ఆయా ప్రాంతాలకు..మతాలకు.. అక్కడ సందర్భాలకు అనుసంధానం చేస్తూ ఉన్నాయి.బ్రహ్మణీయ ఆధిపత్య ప్రచారాలను ఖండిస్తూ మనం ఏమి చెప్పిన హేతుబద్ధంగా.. వాంగ్మయా సహితంగా ఉంటేనే ప్రామాణికం ఔతుంది. పండగలు ఏయే కాలాల్లో ఏ అవసరాలకోసమ్ ఏ నేపథ్యం లో వచ్చాయో,సంస్కృతిలో ఏ పాత్ర పోషించాయో ప్రజల ఆలోచనలు జీవనాన్ని ఎలా ప్రభావితం చేసాయో తులనాత్మకంగా పరిశీలిస్తేనే నేటి తరానికి ఉపయోగ పడతాయి. హిందు మతం లాగా అన్ని..అన్నింటికీ భౌద్దం వ్యాఖ్యానించ అవసరం ను ఆలోచించాలి.
భవతు సబ్బమంగలం నేను మీరుచెప్పీనదానితొ ఏకీభవిస్తున్నా.
వెరీ నైస్ సరిగా చెప్పారు. సాధు సాదు సాదు v
విశాల విషయానికి వ్యక్తి వంపు విజ్ఞత కానే కాదు
ఈ విమర్శనాత్మక వ్యాసo బుద్ధభూమి సంచిక లో వేస్తే చాలామంది తెలుసుకొంటారు.చాలా బాగుంది .క్లుప్తంగా వివరించారు.
హిందూమతంలో ‘దీపావళి’ పండగ అనేది ‘దుష్టుడు, దుర్మార్గుడు’ అయిన ‘నరకుడు’ అనే ‘రాక్షసుడి’ ని కృష్ణుడి భార్య సత్యభామ చంపినందుకు వారి దృష్టిలో అది ‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ’ కాబట్టి బాణా సంచా పేల్చి, దీపాలు పెట్టుకుని సంబరంగా జరుపుకుంటారు. ‘దీపావళి’ పగకు, ప్రతీకారానికీ గుర్తు. అయితే బౌద్ధంలో కూడా ‘దీపావళి’ పండగ అనేది ఉందని కొంతమంది చెప్పడం విచిత్రంగా ఉంది. నిజానికి బౌద్ధంలో అటువంటి పండగ లేదు. అన్ని మతాలలో ప్రతి శుభ సందర్భానికి దీపం, లేదా కొవ్వొత్తి వెలిగించడం అనేది మామూలే అయినప్పటికీ బుద్ధుడు ‘అత్త దీపోబవ’( be the lamp to yourself)అన్నాడు. చరిత్రలో కూడా ప్రతి బౌద్ధ క్షేత్రంలో ప్రార్ధన చేసేటప్పుడు దీపాలు వెలిగించే ఆచారం ఉన్నట్టు తెలుస్తుంది. బిక్షువులు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మూడు నెలల పాటు ఒకే ప్రదేశంలో గృహస్తులకు దగ్గరగా జీవించాలి అనే నియమం ఉంది. దీని ఉద్దేశం వారు గృహస్తులకు సన్నిహితంగా ఉంటూ, వారికి బుద్ధుని ధర్మాన్ని వివరించడం, పరస్పరం సత్ సంబంధాలు ఏర్పరచుకోవడం. ఆ మూడు నెలల కాలాన్ని ‘వర్షా వాసం’ అంటారు. ‘వర్షా వాసం’ పూర్తయినాక గృహస్తులు ‘కఠిన చీవర దానం’ పేరుతో ఒక వేడుక జరిపి బిక్షువులకు కొత్త బట్టలు దానం చేస్తారు. అయితే ‘మహాయాన’ శాఖ వచ్చాక హిందూమతంలోవలే బౌద్ధంలో కూడా అనేక అభూత కల్పనలు, నమ్మకాలు వచ్చి చేరాయి. మహాయానాన్ని అవలంబించేవారు ‘తవతింస’ అనే స్వర్గంలో బుద్ధుడు తన తల్లి అయిన ‘మాయాదేవి’కి ‘అభిధమ్మ’ ను బోధించిన అనంతరం ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దీపాలు వెలిగించి ఉత్సవం చేస్తారు. ప్రస్తుతం ధేరవాద, మహాయాన శాఖల వారిద్దరూ ‘వర్షావాసం’ అనే ఆచారం పూర్తయ్యాక ‘అభిధమ్మ’ లేదా lamp festival పేరుతో పండగ జరుపుకుంటున్నారు. బహుశా అటువంటి దీపాల ఉత్సవాలు జరిగే ప్రదేశం కావున మన అమరావతి బౌద్ధ క్షేత్రానికి ‘దీపాల దిన్నె’ అనే పేరు ఉంది. బౌద్ధం లోని దీపాల పండగకీ, హిందూ మతంలోని ‘దీపావళి కీ అసలు సంబంధమే లేదు. హిందువులు అసురులైన నేటి దళితులను చంపినందుకు పండుగలు చేసుకుంటే బౌద్దులు అందుకు పూర్తిగా భిన్నమైన భావనతో ఉత్సవం చేసుకుని పెద్దలు, పిల్లలు పరస్పరం కానుకలు ఇచ్చుకుంటారు. అది ఒక ప్రేమకు, కరుణకు చిహ్నం.
భారతదేశ చెరిత్రలోఇప్పటివరకు జరిగినంత , జరుగుతున్న వక్రీకరణ , బౌద్ధం విషయంలో జరగకుండా చూడవసిన బాద్యతను భుజానికే ఎత్తుకున్న చంద్రశేఖర్ గారికి అభినందనలు .
ధర్మ వందనాలతో, మీ విశ్లేషణ సూటిగా ఉంది. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
I think this is a real great blog post. Thanks Again. Jemima Harper Mayhew